బిసిఎం10 న్యూస్ ఆగస్ట్ 26 భద్రాచలం : ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోగంజాయి కేసులో అరెస్టైన నిందితుడు ఎక్సైజ్ పోలీసుల అదుపు నుంచి పరారైన ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఆగస్టు 24న మెమో జారీ చేసింది.భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో COR No.241/2026లో నిందితుడిగా ఉన్న మాధబ హంతాల్ ఆగస్టు 5న ఉదయం 5.40 గంటలకు పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నట్లు మెమోలో పేర్కొన్నారు.నిందితుడు పరారైన ఘటనతో పాటు కేసుకు సంబంధించిన పంచనామా, ఇతర రికార్డుల సమర్పణలో తీవ్రమైన విధి నిర్వహణ లోపాలు, తప్పుదారి పట్టించే వివరాలు, ఫోర్జ్డ్ పంచనామా/పత్రాల సమర్పణ వంటి ఆరోపణలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ SHO ఎస్.కె. రహీమున్నీసా బేగం, ఎక్సైజ్ కానిస్టేబుల్ చె. రవి కుమార్లను వెంటనే సస్పెండ్ చేసి, పూర్తి స్థాయి శాఖాపరమైన విచారణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. తీసుకున్న చర్యల నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

0 Comments