హైదరాబాద్, జూన్ 02, బిసిఎం10 న్యూస్.
జెద్దా - కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామ్యం ద్వారా అల్మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్లో ఇది ఏర్పాటైంది. రోగులతో తొలుత సంభాషించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి వైద్యులను తప్పించడం దీని ఉద్దేశం. 'ఈ ఏఐ క్లినిక్ వినూత్న వైద్య సేవా వ్యవస్థ. ఇందులో ఏఐ వ్యవస్థ స్వతంత్రంగా వివరాల సేకరణ నుంచి మందులు సూచించడం వరకూ పలు సేవలు అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. వారు వ్యాధి నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షిస్తారు' అని సైన్యీ సంస్థ పేర్కొంది.
● పనిచేసేదిలా.
ఏఐ వైద్య వ్యవస్థకు ‘డాక్టర్ హువా’ అని పేరుపెట్టారు. క్లినిక్కు వచ్చాక ఒక ట్యాబ్ సాయంతో ఏఐకి తమ వ్యాధి లక్షణాలను రోగి వివరించాలి. వెంటనే అది మరిన్ని ప్రశ్నలు సంధిస్తుంది. మానవ సహాయకుల సాయంతో సేకరించిన డేటాను, చిత్రాలను విశ్లేషిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే డాక్టర్ హువా ఒక చికిత్స ప్రణాళికను అందిస్తుంది. దీన్ని వైద్యుడు కూలంకషంగా సమీక్షించి, సంతకం చేస్తారు. అయితే ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసుల కోసం వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఈ ఏఐ డాక్టర్ ద్వారా ఉబ్బసం సహా దాదాపు 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన కన్సల్టేషన్ సేవలను అందిస్తున్నారు. వైద్యుల డేటాబేస్ను విస్తరించి, 50 శ్వాస, జీర్ణకోశ, చర్మ సంబంధ వ్యాధులకు ఈ సేవలను అందించాలని భావిస్తున్నట్టు సైన్యీ ఏఐ తెలిపింది.

0 Comments