పిచ్చుక పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్న వ్యవసాయ శాఖ.
● అల్ప జీవుల పై అధికారుల ఆధిపత్యధోరణి తగదు.
● అరకొర జీతంతో అష్ట కష్టాలు పడుతున్న కాంట్రాక్ట్ ఏఈఓలు.
ఖమ్మం, అక్టోబర్ 17, బిసిఎం10 న్యూస్.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పంట సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులకు ఏఈఓ లకు మధ్యన చిలికి చిలికి పెద్ద గాలి వాన లా ముదురుతుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో డిజిటల్ అగ్రి మిషన్ లో భాగంగా ఆయా రాష్ట్రాలలో సాగులో ఉన్న భూమిలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ప్రతి ఒక గుంట భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఫోటోలు తీయడం ద్వారా ఆయా పంటల వివరాలను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి తదనుగుణంగా ఈ సర్వే చేపట్టుటలో పాటించాల్సిన విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించి ఈ మార్గ దర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ పెంపొందించి వారికి తాత్కాలిక ఉపాధి కల్పన చూపించాలనే సదుద్దేశంతో ప్రతి 1,000 ఎకరాలకు ఒకరి చొప్పున లోకల్ యూత్ మరియు కృషి సఖిల పేర్లతో తాత్కాలిక ప్రాతిపదికన నిరుద్యోగ యువతను అపాయింట్, చేసి వారి ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి కుంట భూమిని 100% అక్యురసితో సర్వే చేపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పంట సర్వే మార్గదర్శకాలకు రూపొందించింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర 11 రాష్ట్రాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి 1,000 ఎకరాలకు ఒక నిరుద్యోగ యువతను తాత్కాలిక ప్రాతిపదిక నియమించుకొని వారితో క్షేత్రస్థాయిలో పంటల సర్వేను పకడ్బందీగా చేపిస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఒక కోటి 50 లక్షల ఎకరాల సాగు భూములను సర్వే చేపించడానికి సుమారుగా 15,000 మంది సిబ్బంది అవసరం అవుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖలో అందుబాటులో ఉన్న కేవలం 2,600 మంది ఏఈఓల తోనే సుమారుగా 15,000 మంది చేయాల్సిన పనిని చేపించాలనే ప్రయత్నాలు చేయడం, వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు మధ్యన తీవ్రమైన అఘాతాన్ని సృష్టిస్తుంది. 8 నుండి 10 మంది చేయాల్సిన పనిని కేవలం ఒక్క ఏఈఓ తోనే చేయించాలని చూడటం వల్ల ఏఈఓల పై తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగిస్తుందని ఏఈవోలు వాపోతున్నారు. రాష్ట్రంలో 2,606 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ప్రస్తుతం 2,300 మంది మాత్రమే రెగ్యులర్ ఏఈవోలు ఉన్నారు. మిగతా 300 పైచిలుకు స్థానాలలో ఖాళీలు ఉండగా ఈ స్థానాల్లో నెలకు కేవలం 15,000 రూపాయల గౌరవభృతితో అవుట్సోర్సింగ్ విధానంలో కాంట్రాక్ట్ ఏఈఓ లను నియమించుకొని వారితో రెగ్యులర్ ఏఈఓలు చేయాల్సిన అన్ని పనులను వ్యవసాయ శాఖ చేపించుకుంటుంది. డిజిటల్ పంట సర్వే చేపట్టుటలో ఎదురయ్యే శారీరక శ్రమ, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాలను తెలియజేస్తూనే అరకొర సిబ్బందితో ఒక కోటి 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుచే పంటల వివరాలను హడావిడిగా సర్వే చేపించడం వల్ల వచ్చే డేటా కూడా పూర్తిగా తప్పులతడకగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మారుమూల పంట క్షేత్రాలలో, కొండలు, గుట్టలలో, అడవి భూములలో పంట సర్వే కి ఒంటరిగా వెళ్లిన సందర్భాలలో ఏఏవోలు అనుకోని ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలలో రెగ్యులర్ ఏఈఓల కుటుంబాలకు ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి. వ్యక్తిగత ప్రమాద భీమా నగదు ఇవ్వడంతో పాటు వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కాంట్రాక్టు విధానంలో నియమితులయ్యే కాంట్రాక్ట్ ఏఈఓలకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు కూడా లభించవు. రెగ్యులర్ ఏఈవోలు చేయలేని పనిని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బలవంతంగా కాంట్రాక్ట్ ఏఈఓలతో చేయించే ప్రయత్నాలు మానుకోవాలని గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓలు ఆయా జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య కి ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు అందరు బివినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ వృత్తి విద్య కోర్సులు చదువుకొని, నిరుద్యోగం కారణంగా, ఆర్థిక నష్టాల నుండి బయటపడాలనే ఉద్దేశంతో అతి తక్కువ జీవితంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఈఓల పై ఉన్నతాధికారుల వేధింపు చర్యలను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఏఈఓలు అల్టిమేట్ జారీ చేశారు. తక్షణమే డిజిటల్ పంట సర్వే మొదలు చేయకపోతే నిర్దాక్షిణ్యంగా వీరిని ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. కాంట్రాక్ట్ ఏఈఓల కు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెగ్యులర్ ఏఈఓలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. వీరి పై కక్షపూరిత చర్యలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రెగ్యులర్ ఏఈఓలు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారుల జేఏసీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, మహేష్, కుమార్ రాజా, సరిత, రాము, రవీందర్, ఆయేషా, ప్రతిభ, ఆదర్శ్, శివ, ఔట్సోర్సింగ్, ఆత్మ సిబ్బంది, జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

0 Comments