●
భద్రాచలం రామాలయం సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభం.
భద్రాచలం, అక్టోబర్ 16, బిసిఎం10 న్యూస్.
‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. ఇందులో భద్రాచలం ఆలయం ఉత్సవాల విశేషాలను, పూజలు సహా పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఇక్కడి రోజువారీ క్రతువుల గురించి వివరించే వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఈ ఛానెల్ ట్రయల్ రన్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 1300 ఎకరాల భూమి ఉంది. దీంతో పాటు దాదాపు 68 కిలోల బంగారం, 980 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 20 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించారు. దీన్ని త్వరలో 'భద్రాద్రి దివ్యక్షేత్రం' యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయనున్నారు. వీటితో పాటు ఆలయంలో నిర్వహించిన పలు ఉత్సవాల వీడియోలను సైతం ఇందులో పొందుపర్చనున్నారు. టీటీడీకి కూడా తిరుమల శ్రీవారి పేరుతో టీవీ ఛానెల్, యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోంది. ఇప్పుడు భద్రచలం ఆలయం కూడా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తోంది. కాగా, గతేడాదే భద్రచలం ఆలయంలో తిరుమల తరహాలోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారిక వెబ్సైట్లో నిత్య కళ్యాణం, అభిషేకం, అర్చన, దర్శనం, సుప్రభాతం, పవళింపు, తులాభారం, వేదాశీర్వచనం, పట్టాభిషేకం, రథసేవలు వంటి టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కలిగింది. నిత్యం వీఐపి, వీవీఐపిల రాకతో కలకలాడే భద్రగిరి అభివృద్ధిని ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. గోదావరి తీరంలోని ఈ పుణ్యక్షేత్రాన్ని టూరిజం హబ్గా కూడా అభివృద్ధి చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం వాసులు, భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారన్నారు.

0 Comments