Doctors cannot be saved– హింసకు వ్యతిరేకంగా డాక్టర్లను కాపాడే విషయంలో కేంద్రం స్పష్టీకరణ : ఆర్టీఐ సమాచారంలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వైద్య సంరక్షణ నిపుణులు, వైద్యులపై జరిగే హింసకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలపై కేంద్రం మరోసారి తన వైఖరిని తెలిపింది. తాము ఎలాంటి ప్రత్యేక చట్టాన్నీ రూపొందించబోమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందిపై హింసకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటూ పలు డిమాండ్లు వినిపించాయి. హింసకు వ్యతిరేకంగా వైద్యులకు రక్షణ కల్పించాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)తో పాటు పలు మెడికల్ అసోసియేషన్లు దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ను నిర్వహించాయి. అయితే, ఇవేమీ పట్టని కేంద్రం.. ఎలాంటి ప్రత్యేక చట్టాన్ని రూపొందించటంలేదని తెలపటం గమనార్హం. వాస్తవానికి 2019లోనే ప్రత్యేక చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఆ తర్వాత దానిని రద్దు చేసిందన్న విషయం ఈ ఆర్టీఐ ప్రశ్నతో బహిర్గతమైంది. కేరళకు చెందిన సామాజికకార్యకర్త, వైద్యులు కె.వి బాబు ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని కోరారు. ‘ది హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయోలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు, 2019ను ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ రూపొందించిందనీ, సంప్రదింపుల కోసం దానిని సర్క్యులేట్ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆ తర్వాత ప్రత్యేక చట్టాన్ని రూపొందించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. అయితే, ప్రభుత్వ వైఖరిని మమ్మల్ని నిరుత్సాహపర్చదని ఐఎంఏ జాతీయాధ్యక్షులు డాక్టర్ ఆర్.వి అశోకన్ అన్నారు. కేంద్ర చట్టం కోసం తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

0 Comments