Breaking News

Loading..

మహానటుడు 'కోట శ్రీనివాసరావు'కు నివాళులు.


హైదరాబాద్, జులై 13, బిసిఎం10 న్యూస్.

కోట నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. ఆయన ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నటుల లో కోటా శ్రీనివాసరావు ఒకరు. కమెడియన్ గా, విలన్ గా ఈయన చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అనేక అవార్డులను కూడా అందుకున్నారు. 750 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు, 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బిజెపి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.1978 నుంచి 2023 వరకు వరుసగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్న ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫిల్మ్ నగర్ లోని స్వగృహంలో కన్నుమూశారు.

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యం నుండి కోటాకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు.1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలం పై 20 యేళ్ళ అనుభవం గడించాడు.1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ గా తీసుకోలేదు. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. విలన్, కమెడీయన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.1985లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలోని ‘గుడిశెల కాశయ్య’ పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా పోషించి, నవరసాలు పండించగల బహుముఖ నటుడుగా పేరు తెచ్చుకున్నారు.ఆయన నటించిన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు అహ నా పెళ్ళంట (1987) ఇందులో పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకులను కామెడితో కడుపుబ్బా నవ్వించారు. గాయం (1993) పొలిటికల్ గూండాగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. యమలీల (1994) మాంత్రికుడిగా ఆయన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది. మనీ (1993) ఇందులో ఆయన ఇంగ్లీష్ సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) వెంకటేష్ తండ్రిగా నటించి మెప్పించారు. గణేష్ (1998) కామెడీ విలన్‌గా సాంబశివుడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ నలుగురు (2004) ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ, బృందావనం వంటి చిత్రాలలో తాత పాత్రలు, అత్తారింటికి దారేది (2013) లోని కీలక పాత్రలు కూడా ఆయన కెరీర్‌లో మైలురాళ్ళు..సూపర్స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్కల్యాణ్, సాయిధరమ్తోజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ‘అహనా పెళ్ళంట!’, ‘ప్రతి ఘటన’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.కోట శ్రీనివాసరావు 2023లో విడుదలైన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. అంతకు ముందు, 2021లో వచ్చిన కొండపొలం, పవర్ ప్లే వంటి చిత్రాల్లో కనిపించారు. ఆయన సినీ ప్రస్థానంలో మొత్తం 750 సినిమాలకు పైగా సినిమాలు చేశారు. ఆయనను వరించిన అనేక అవార్డులలో తొమ్మిది నందులు కూడా ఉండటం విశేషం.. 1985లో ‘ప్రతిఘటన’ చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు, 1993లో ‘గాయం’కు ఉత్తమ విలన్, 2004లో ‘ఆ నలుగురు’కు ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఇలా చాలా సినిమాలకు అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ సీమా అవార్డు దక్కింది. 2015లో ఆయన సినీ రంగానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీని అందుకున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం (2013) వంటి అనేక పురస్కారాలు కూడా ఆయనను వరించాయి. అటు రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఒక యాక్టర్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీసు, మాంత్రికుడు వంటి విభిన్న పాత్రల్లో ఆయన జీవించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడు కోటా శ్రీనివాసరావు. ఇలాంటి గొప్ప నటుడు మన మధ్య లేరనే చేదు వార్తను అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.

Post a Comment

0 Comments