ఖమ్మం, మే 28, బిసిఎం10 న్యూస్.
జపాన్ను వెనక్కు నెట్టేసి మన దేశం ప్రపంచ జిడిపిలో నాల్గవ స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతి ఆయోగ్ సిఇవో బివిఆర్ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది, అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు. నూట నలభై కోట్ల జనాభాలో ఈ లెక్కల ఆల్జీబ్రా ఎంతమందికి అర్ధమవుతుంది..??
'నేను చెప్పినట్లుగా మనది నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్ చెబుతున్నది, జపాన్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ' అని సుబ్రమణ్యం నీతి ఆయోగ్ పాలక మండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ఐఎంఎఫ్ ఏప్రిల్ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ (నామినల్) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74, భారత్ 4.19, జపాన్ 4.19, బ్రిటన్ 3.84, ఫ్రాన్స్ 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 2025-26 నాటికి మన జిడిపి 4.187, జపాన్లో 4.186 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
● బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా.
నరేంద్ర మోది అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105 శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్ కొద్ది నెలల క్రితం చెప్పింది. అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత..?? 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించే వారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వం సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్ మాలవీయ సెలవిచ్చారు. అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105 కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.
● మన ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం.
'గత పదేళ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్య తరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు'. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్ర రేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పథకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేళ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప(10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35 నుంచి 49.9), అత్యంత ఆందోళనకరం(50 పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేళ్లుగా కూడా ఉంది. పదేళ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో(2014-2024) మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3/కు మాత్రమే తగ్గింది. దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు..?? ఇదే కాలంలో పాకిస్తాన్ స్కోరు 29.6 నుంచి 27.9 కి తగ్గింది. దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగి, అన్నం తింటూ పక్క దేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్ ర్యాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు..?? గత పదేళ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోది సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనల్ని నాల్గవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోది ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా.
● తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు.
కొందరి దగ్గర సంపదలు పోగు పడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోది ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50, 49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అసలు జిడిపిని సాధారణ(నామినల్), పిపిపి(పవర్ పర్చేజింగ్ పారిటీ) పద్ధతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్ర మోది అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోది గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికి అదే స్థానంలోనే మోది ఉంచారు గనుక. ఐఎంఎఫ్ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరు నెలల్లోనే సాధారణంలో 4.9 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు, అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి.
● దున్నబోతే దూడల్లో - మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే ఎలా..??
రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపు కుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139 దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు (తాజాగా 136 గనుక 135 ముందున్నాయి). పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేళ్లలో మన జిడిపి 105 శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్ 143, పాకిస్తాన్ 159, సీ జిన్పింగ్ ఏలుబడిలో కుప్పకూలి పోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో(తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్ చెప్పింది. మన తలసరి రాబడి పది వేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తుకృష్ణన్ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రథమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581 (2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్ దేవుడున్న అమెరికా 89,678 (2025 ఐఎంఎఫ్) స్థాయికి, చివరికి పడక కుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనానైనా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.
ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికి నరేంద్ర మోది నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్ ముందుకు వచ్చిందని బిజెపి నేత ప్రదీప్ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారి పోయాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్, ఫ్రాన్స్ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడింది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే ఎలా. అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదు లక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పది లక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయం పై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికి అదే భూమి మీద 2023-24లో జనాభాలో 46.1 శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు. చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క ఏకరాల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట, జిడిపి కూడా అంతే.

0 Comments