ఉత్తరప్రదేశ్, జనవరి 13, బిసిఎం10 న్యూస్.
హిందూ సనాతన ధర్మంలో ‘మహా కుంభమేళా’ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీని కంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి ‘హరిద్వార్’ లేదా ‘ప్రయాగ్రాజ్’ లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభ మేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు ‘మహా కుంభమేళా’ నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు ‘మహా కుంభం’ ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగ నుంచే ‘కుంభస్నానం’ ప్రారంభమవుతుంది.
● ‘కుంభమేళా’ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి.
కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ‘కుంభమేళా’ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్థన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, కాలకూటవిషం, అమృతం వంటివి బయటికొచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది.
● అమృతం కోసం జరిగిన పోరాటం.
చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు, గురువు కలశం దాచాడు. సూర్య దేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమునా, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం, బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పపడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం, భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దీని ప్రకారం, దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే, భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమి పై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

0 Comments